Saturday, 9 May 2026

అంగన్‌వాడీల్లో ‘ఫ్యాన్–ట్యూబ్’ పేరిట దోపిడీ!




 అంగన్‌వాడీల్లో ‘ఫ్యాన్–ట్యూబ్’ పేరిట దోపిడీ!

₹20 లక్షల టెండర్… ₹10 లక్షలు మింగేసినట్టు ఆరోపణలు

 ఒక మోడల్ కి బదులు తక్కువ ధర మోడల్ సరఫరా – సప్లయర్‌తో చేతులు కలిపిన అధికారులేనా?

నల్గొండ, శంఖారావం:

చిన్నారుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమమే అవినీతి అడ్డాగా మారిందా? అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఎండాకాలం ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ సదుద్దేశాన్ని కొందరు తమ జేబులు నింపుకునేందుకు వాడుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

శాఖా బడ్జెట్ లేనప్పటికీ మినరల్ ఫండ్స్ నుంచి నిధులు మళ్లించి అంగన్‌వాడీ కేంద్రాలకు హై స్పీడ్ ఫ్యాన్లు, 3-ఇన్-వన్ LED ట్యూబ్‌లైట్లు సరఫరా చేయాలంటూ టెండర్ పిలిచారు. టెండర్ ప్రక్రియ, ఆర్డర్ జారీ వరకూ అన్నీ నిబంధనల ప్రకారమే జరిగినట్టు చూపించారు. కానీ అసలు దోపిడీ సప్లై దశలోనే మొదలైందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

పేరు ఒక్కటే… సరుకు వేరే!

టెండర్‌లో పేర్కొన్న క్రాంప్టన్ హై స్పీడ్ ఫ్యాన్లకు బదులుగా  క్రాంప్టన్ సివిడ్ మోడల్ నార్మల్ సీలింగ్ ఫ్యాన్లు,

అలాగే 3-ఇన్-వన్ LED ట్యూబ్‌లైట్ల స్థానంలో సాధారణ ట్యూబ్‌లైట్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల అయితే టెండర్‌లో లేని ఇతర కంపెనీల ట్యూబ్‌లైట్లు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సగం సొమ్ము స్వాహా?

ఈ నాసిరకం సరఫరాతో ₹20 లక్షల టెండర్‌లో సుమారు ₹10 లక్షల మేర ప్రభుత్వ సొమ్ము గాలిలో కలిసిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం సప్లయర్ ఒక్కడి పని కాదని, కొంతమంది అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లల సంక్షేమమా? లేక కొందరి కమీషన్లా?

పిల్లల కోసం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది అధికారులు, సప్లయర్లు కలిసి కమీషన్ల పండుగగా మార్చేశారన్న విమర్శలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన వసతులు కల్పించాల్సిన బదులు, చెత్త సరుకుతో ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారన్న ఆరోపణలు ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై కళ్లెత్తి చూడాలని,

సప్లై చేసిన సామగ్రిపై తక్షణ ఫిజికల్ వెరిఫికేషన్,

టెండర్ నిబంధనలతో సరఫరా సరుకును పోల్చి విచారణ,

అవినీతికి పాల్పడిన సప్లయర్‌తో పాటు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

లేకపోతే… పిల్లల పేరుతో జరిగిన ఈ దోపిడీకి న్యాయం జరగదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

— శంఖారావం ప్రతినిధి

Friday, 8 May 2026

ప్రకాశం బజార్‌లో భూకబ్జాదారుల ఆగడాలు

 ప్రకాశం బజార్‌లో భూకబ్జాదారుల ఆగడాలు


1959 రిజిస్ట్రేషన్ ఉన్న భూమిపై భూకబ్జాదారుల కన్ను

మున్సిపల్ కమిషనర్‌కు బాధితుల వినతిపత్రం

ప్రకాశం బజార్ ప్రాంతంలో తాతల కాలం నుంచి వస్తున్న తమ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు గడాలె విజయ, జయ ప్రకాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ భూకబ్జాయత్నాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

బాధితుల మాటల్లో చెప్పాలంటే, సంబంధిత భూమికి 1959 సంవత్సరానికి చెందిన చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్పష్టంగా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ, ఎలాంటి రిజిస్టర్ డాక్యుమెంట్లు గానీ, హక్కు పత్రాలు గానీ లేని కొంతమంది వ్యక్తులు భూమిని కబ్జా చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు

న్యాయం కోసం మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి సరైన స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తూ మీడియాకు తప్పుడు సమాచారం అందించి అధికారులను మభ్యపెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే భూకబ్జాదారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, తమ పరువుకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా కూడా వేయడానికి వెనుకాడబోమని గడాలె విజయ, జయ ప్రకాష్ స్పష్టమైన హెచ్చరిక చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ప్రజా ఉద్యమానికి దిగాల్సి వస్తుందని వారు తేల్చిచెప్పారు.

Wednesday, 6 May 2026

డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*

 l

డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*  


*"సెల్ రిపేర్‌లో ఉంది... ఫోన్ ఎత్తలేదనే నెపంతో వేటు: బాధితుడు 

క్రైమ్ బ్యూరో*  

*నల్లగొండ:* "లంచం ఇవ్వలేదనే అకారణంగా సరెండర్ చేశారు" అంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి - డీఎస్‌ఓపై పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సంచలన ఆరోపణలు చేశారు. తన సరెండర్ ఉత్తర్వులు రద్దు చేసి యథావిధిగా విధుల్లో కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.

*ఫిర్యాదులో ఏముంది?*  

"నా సెల్ ఫోన్ రిపేర్‌లో ఉండటంతో గత నెల 21న డీఎస్‌ఓ ఫోన్ చేస్తే మాట్లాడలేకపోయాను. కానీ 22న నాకు మెమో ఇచ్చారు. నేను మునుగోడు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో విధుల్లో ఉన్నానని వివరణ ఇచ్చాను. అయినప్పటికీ 30న ఆకస్మికంగా నన్ను సరెండర్ చేశారు" అని రఘునందన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


*"చాలాసార్లు డబ్బులు అడిగారు"*  

"డీఎస్‌ఓ చాలాసార్లు నన్ను డబ్బులు అడిగారు. నేను ఇవ్వలేనని చెప్పాను. ఆ కక్షతోనే నన్ను అకారణంగా సరెండర్ చేశారు" అని డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ సీఎస్‌కు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణ చేశారు.

ధాన్యం కొనుగోళ్ల సీజన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. అక్రమ రవాణా, దళారుల దందా అరికట్టాల్సిన డిప్యూటీ తహసీల్దార్‌నే సరెండర్ చేయడంపై శాఖలో చర్చ జరుగుతోంది. ఫోన్ ఎత్తలేదనే సాకుతో మెమో ఇచ్చి, విధుల్లో ఉన్నా పట్టించుకోకుండా సరెండర్ చేయడం వెనుక "లంచం మతలబు" ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

* శంఖారావం ప్రశ్న:*  

1. సెల్ రిపేర్‌లో ఉంటే అది నేరమా? అధికారిక మెమోకు విధుల్లో ఉన్నానని వివరణ ఇచ్చినా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?  

2. డబ్బులు అడిగారనే ఆరోపణపై విచారణ జరగాలి.

3. ధాన్యం కొనుగోళ్ల వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిని తప్పిస్తే దళారులకు పండగేనా?


సీఎస్ ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్‌ఓపై చర్యలు ఉంటాయో లేదో వేచి చూడాలి.


ఈ విషయం పై DSO వివరణ కోరగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చండూరు RDO ఇచ్చిన రిపోర్ట్ తో జాయింట్ కలెక్టర్ dt ని సరెండర్ చేసినట్లు తెలిపారు. తనపై dt చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.


Saturday, 2 May 2026

*"అమరవాది సభ పెత్తనం ఆంధ్రా వారిదే - తెలంగాణ ఆర్యవైశ్యుల బహిష్కరణతో అమరావాది సభ అట్టర్ ఫ్లాప్"* - మిడిదుడ్డి శ్యాంసుందర్





*"అమరవాది సభ పెత్తనం ఆంధ్రా వారిదే - తెలంగాణ ఆర్యవైశ్యుల బహిష్కరణతో అమరావాది సభ అట్టర్ ఫ్లాప్"*

- మిడిదుడ్డి శ్యాంసుందర్


*హైదరాబాద్, , మే 2:* అమరవాది ప్రమాణ స్వీకార సభ కాస్తా ఆంధ్రా నాయకుల సభగా మిగిలిపోయింది. తెలంగాణ ఆర్యవైశ్య నాయకులు, ప్రముఖులు మూకుమ్మడిగా బహిష్కరించడంతో అమరావాది వర్గం పరువు బజారున పడిందని మిడిదుడ్డి శ్యాంసుందర్ విమర్శించారు.


*తెలంగాణ నాయకుల పూర్తి బహిష్కారం*  

నేడు జరిగిన ప్రమాణ స్వీకారానికి తెలంగాణ వైశ్య పితామహుడు గంజి రాజమౌళి గుప్తా, MLC బొగ్గారాపు దయానంద్, MLA దన్‌పాల్ సూర్యనారాయణ, మాజీ MLA గణేష్ గుప్త, వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సుజాత, మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్ గుప్త, బొల్లం సంపత్ తదితర తెలంగాణ ప్రముఖులెవ్వరూ హాజరుకాలేదు. ప్రోటోకాల్ ఉన్న నాయకులు సైతం ఈ "అక్రమ ఎన్నిక గెలుపు"ను సమ్మతించక బహిష్కరించడం గమనార్హం. అని ఆయన అన్నారు.


అమరవాది కి *"ఆంధ్రానే దిక్కు" అయ్యిందని - శ్యామ్ సుందర్ ధ్వజం ఎత్తారు.

ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. "11 ఏండ్లుగా అప్రజాస్వామికంగా ఉన్న అమరావతి వర్గానికి తెలంగాణ ఆర్యవైశ్యులు బుద్ధి చెప్పారు. నిన్నటిదాకా 'బయటి రాష్ట్రం' అంటూ ఆంధ్రాను సంబోధించిన వారే, నేడు TG వెంకటేష్, కనక రాజు లాంటి ఆంధ్రా నాయకులే దిక్కయ్యారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం" అని విమర్శించారు.


*"శ్రీశైలం సత్రం విమర్శ మరిచారా?" - అని ఆయన  సూటి ప్రశ్న*   వేశారు. "గతంలో శ్రీశైలం సత్రంలో TG పేరు పెడితే 'తెలంగాణ వారు లేరా?' అని విమర్శించిన అమరవాది, ఇప్పుడు తనకు ఆంధ్రా వారే దిక్కు కావడం ఏవిధంగా సమర్థించుకుంటారు? అప్పుడు ప్రాంతీయవాదం, ఇప్పుడు ఆంధ్రా వాదమా? ఆయన వైఖరి ఏమిటో తెలంగాణ ఆర్యవైశ్య సమాజానికి తెలియజేయాలి" అని శ్యామ్ సుందర్ నిలదీశారు.


*"2-3 ఓట్ల గెలుపు గెలుపు కాదు"*  

"స్వచ్ఛమైన నీతి నిజాయితీ ఓట్లు నాకు 520 వచ్చాయి. డబ్బు, అంగబలం, అధికారం ఉపయోగించి సాంకేతికంగా 2-3 ఓట్లతో గెలిచామనుకోవడం భ్రమ. సమాన ఓట్లు వచ్చాయంటేనే జనవ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోండి" అని శ్యామ్ సుందర్ స్పష్టం చేశారు.


*"కోర్టు ద్వారా బుద్ధి చెబుతాం"*  

కేవలం కొద్దిమంది రైస్ మిల్లర్ల నాయకులతో సభ జరిపి ప్రమాణ స్వీకారం చేసుకోవడం విఫల ప్రయత్నమని ఆయన ఎద్దేవా చేశారు. "అక్రమ పదవి శాశ్వతం కాదు. ఉప్పల్‌లో కానీ మహాసభలో కానీ అన్యాయం జరిగితే పోరాటం తప్పదు. అక్రమాలపై త్వరలోనే న్యాయస్థానం ద్వారా బుద్ధి చెబుతాం" అని హెచ్చరించారు.

 "పదవులు, బానిసత్వం, గులాంగిరి, వ్యాపారం కోసం కొందరు ఉండవచ్చు. కానీ ఆత్మాభిమానం, పౌరుషం, న్యాయం, ధర్మం ఉన్న ఆర్యవైశ్య జాతి ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. అవసరమైతే మన సత్తా, బలం, బలగం, పోరాటం చూపిస్తాం. వేచి చూద్దాం" అని పేర్కొన్నారు.


_తెలంగాణ నాయకులు పూర్తిగా దూరం పెట్టడంతో అమరవాది వర్గం ఏకాకి అయ్యింది. "తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ" పేరు పెట్టుకుని ఆంధ్రా వారితో సభ జరుపుకోవడం విడ్డూరంగా ఉందని సామాజిక వర్గం చర్చించుకుంటోంది._


---

Friday, 1 May 2026

ఒవైసీ కాలేజీ ఆక్రమణలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది?


 ఒవైసీ కాలేజీ ఆక్రమణలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది? 


పేదల ఇండ్లు కూల్చడంలో చూపించిన అత్యుత్సాహం చెరువులు ఆక్రమించి కడుతుంటే కనపడట్లేదా!


హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..


సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఒవైసీ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఓ న్యాయవాది


ఈ పిటిషన్ విచారిస్తూ పేదల ఇళ్ల మీదకి ఎలాంటి నిబంధనలు లేకుండా వెళ్లే హైడ్రాకు ఒవైసీ కాలేజీ పట్ల వివక్ష ఎందుకని నిలదీసిన న్యాయమూర్తి..


ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్థారణకు రెండు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా, ఎన్ని ఏళ్లు ఏం చేశారని, ఆక్రమణలకు బాధ్యులైన అధికారులపై నివేదిక తయారు చేయాలని హైకోర్టు ఆదేశాలు..


ఒవైసీ విద్యాసంస్థలో చదువుతున్న వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి మార్చాలని, బయటికి వెళ్లాలనుకునే వారికి ఒవైసీ కాలేజీ యాజమాన్యం సహకరించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు..

Wednesday, 29 April 2026

వానాకాలం పంటలకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

 పత్రికా ప్రకటన, నల్గొండ, 29.4.2026

____________________________


@ వానాకాలం పంటలకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్.




             వానాకాలం పంటల సాగులో రైతులు తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాలనే ఉపయోగించాలని, నకిలీ విత్తనాల జోలికి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు.

రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


       బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అగ్రికల్చర్ సివిల్ సప్లై, రెవెన్యూ  అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు.


      

        జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకై  ప్రత్యేక టాస్క్ ఫోర్స్  స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ టీంలు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో పనిచేస్తూ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. ఎన్ ఫోర్స్‌మెంట్ టీంలు వారానికి కనీసం రెండు సార్లు తనిఖీలు చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని 869 గ్రామపంచాయతీలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వానాకాలం ప్రారంభానికి ముందే కాటన్ సీడ్స్, ఎరువుల సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎరువులు విత్తనాల

 డిస్ట్రిబ్యూటర్లు రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు విక్రయించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సివిల్ సప్లై, మార్కెటింగ్, అగ్రికల్చర్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లు ద్వారా మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

యాక్షన్ ప్లాన్ ప్రకారం గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో సమావేశాలు పూర్తి చేయాలని, సీడ్ మరియు ఫెర్టిలైజర్ డీలర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. కాటన్ సీడ్ మరియు పాడి సంబంధిత విత్తనాల స్టాక్ ఎంత ఉందో మండల ఆఫీసర్ కి చెప్పాలని లేనిచో జిల్లా  అధికారులకు తెలియజేయాలన్నారు.

యూరియా మరియు ఇతర ఎరువుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, అవసరమైతే వెంటనే జిల్లా స్థాయిలో చర్యలు తీసుకుని సరఫరా చేస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలు కఠినంగా నిఘా పెట్టి, కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


         ఈ సమావేశంలో ఏ ఎస్పి రమేష్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్, జిల్లా అధికారులు ఉన్నారు.

____________________________ 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Monday, 27 April 2026

విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్

విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని  జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్

         విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని




  జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్. అన్నారు.ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక  99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత & రక్షణ మరియు "మత్తు పదార్థాలకు నో చెప్పండి"అనే అంశంపై  ఈ నెల 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థల్లో ఉన్న విద్యార్థులు ఉన్నతికి కృషి చేస్తామని  కలెక్టర్ అన్నారు.


         సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ (CCIs)ల్లో ఆశ్రయం పొందుతున్న 18 సంవత్సరాల లోపు  బాల బాలికలకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేశారు. జనన ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, హెల్త్ కార్డులు, ఆధార్ కార్డులు, సేవింగ్ బ్యాంక్ ఖాతా పుస్తకాలను జిల్లా  కలెక్టర్ బాలలకు అందజేశారు.


       ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు సంరక్షణ సంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలను బాలలు సద్వినియోగం చేసుకొని బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.


         ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు  కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె. గణేష్, జిల్లా కో-ఆర్డినేటర్ (చైల్డ్ లైన్)  బి. మహేశ్, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది  ఉన్నారు.