బోనాల జాతరకు సర్వం సిద్ధం.. భక్తులకు కట్టుదిట్టమైన భద్రత
బోనాల జాతరకు సర్వం సిద్ధం.. భక్తులకు కట్టుదిట్టమైన భద్రత
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం మొత్తం బోనాల శోభతో పులకించిపోతుంది. హైదరాబాద్ లో ఎటు చూసినా సందడే సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ నిలుస్తూ వస్తోంది. ఇక ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండగ ఘనంగా జరగనుంది. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల పండగపై సమీక్ష నిర్వహించారు. జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలతో మొదలవుతుంది. అలాగే 20,21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఉత్సవాలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు 20 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21 వ తేదీన అమ్మవారి కల్యాణం, 22వ తేదీన రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 2 న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, ఆగస్టు9 న లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి బోనాలు జరుగుతాయని ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు బోనాల పండగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 3,427 ఆలయాలకు రూ.15.05 కోట్ల నిధులు విడుదల చేసింది. ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీసు , ఆరోగ్య శాఖల సమన్వయంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.



.jpeg)




