Wednesday, 8 July 2026

సర్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్






 సర్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్


          జిల్లాలో ఓటరు జాబితా  ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.


         బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15 లక్షల 16 వేల 253 మంది ఓటర్లు ఉన్నారని ,ఇందులో 15 లక్షల 12 వేల 548 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటివరకు 99.76 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. మిగిలిన ఫారాల పంపిణీని కూడా త్వరలో పూర్తి చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు.

ఇప్పటివరకు సుమారు 33.58 శాతం ఫారాలను తిరిగి స్వీకరించామని, ఇంకా సుమారు 66 శాతం ఫారాలను సేకరించాల్సి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్  సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రారంభ రోజుల్లో బీఎల్ఓల పనితీరులో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం బిఎల్ఓలు అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ  సహకరిస్తున్నారని తెలిపారు. బీఎల్ఓలు ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి ఫారాల సేకరణ చేపడుతున్నారని పేర్కొన్నారు.

2002 ఓటరు జాబితాకు సంబంధించి ఫారాలను ఎలా నింపాలనే సందేహాలపై ఎన్నికల కమిషన్‌కు వివరించామని, 2002 ఓటరు జాబితాను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటివరకు 88 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, ప్రతి బీఎల్ఓ వద్ద సంబంధిత జాబితా అందుబాటులో ఉందన్నారు.

మరణించిన ఓటర్ల పేర్లను తొలగించాలని, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. డబుల్ ఓట్లను తొలగించేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు. గ్రామంలో ఓటు ఉంచుకోవాలా లేదా పట్టణంలో ఉంచుకోవాలా అనే విషయంలో ఓటర్లు ఒక నిర్ణయం తీసుకొని,  . ఎక్కడైనా ఒకఓటును ఉంచుకోవాలని తెలిపారు.

సర్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేయాలని,  పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఇళ్లు తాళం వేసి ఉండడం వంటి కారణాలతో ఫారాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల బీఎల్ఏలు బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

కొన్ని కుటుంబాలకు చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, అటువంటి సందర్భాల్లో ఫారం-8 ద్వారా కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకునే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదం తీసుకున్న తర్వాత, జిల్లా స్థాయిలో కూడా ఆమోదం పొంది తుది జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు.

పనిభారం ఎక్కువగా ఉన్న లేదా పనితీరు బలహీనంగా ఉన్న బీఎల్ఓలకు సహాయకులను నియమించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి బీఎల్ఓ ఇంటింటికీ తిరిగి ఫారాలు నింపాలని సూచించారు. ప్రతి ఫారంపై సంబంధిత బీఎల్ఓ ఫోన్ నంబర్ ఉంటుందని, ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంప్రదించాలని సూచించారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చే సూచనలను పరిశీలించి, అవసరమైతే ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఏలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

            ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్  జె శ్రీనివాస్ ,రెవెన్యూ అధికారి దశరథ, కాంగ్రెస్ పార్టీ  ప్రతినిధి ముంతాజ్ అలీ ,బి ఆర్ఎస్ నుండి బక్క పిచ్చయ్య ,బిజెపి తరఫున లింగస్వామి, సిపిఎం నుండి నర్సిరెడ్డి, ధర్మసమాజ్ పార్టీ ప్రతినిధి రవికుమార్, ఆప్  పార్టీ నుండి రవీందర్,ఎంఐఎం. నుండి కలీం ,

టిడిపి  నుండి రవి తదితరులు పాల్గొన్నారు .

____________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్


 తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో చర్చించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు నివేదికను అందించారు.

✅ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారితో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి గారు, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి గారు భేటీ అయ్యారు.
✅ ఖ‌మ్మం జిల్లాలో ₹ 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్టు ప్రతినిధులు వివరించారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, న‌ర్సరీ, పరిశోధన – అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజ‌ర్ల మండ‌లం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వం కేటాయించింది.
✅ సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎక‌రాల భూమిని కేటాయించాల‌ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ప్రాసెసింగ్ యూనిట్ కోసం రాహ‌దారిని విస్త‌రించాల‌ని ముఖ్య‌మంత్రి గారిని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు టీజీఐఐసీ ఆధ్వ‌ర్యంలో రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

ఎంత పటిష్టమైన ఉద్యోగ భద్రత!

 ఎంత పటిష్టమైన ఉద్యోగ భద్రత!


> ఈమె పూజా సింఘాల్, ఐఏఎస్ 2000 బ్యాచ్, జార్ఖండ్
> ఈమె 21 ఏళ్ల వయసులోనే అఖిల భారత ర్యాంకు 10 సాధించి, భారతదేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి అయ్యారు
> 2022లో ఎంజీఎన్ఆర్ఈజీఏ మరియు మైనింగ్ లీజు కుంభకోణం ఆరోపణలపై ఈడీ చేత అరెస్టు చేయబడ్డారు
> ఈడీ ప్రకారం, 36 కోట్ల రూపాయల నగదు మరియు 82 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు జప్తు చేయబడ్డాయి
> జ్యుడిషియల్ కస్టడీలో 2 సంవత్సరాల 4 నెలలు జైలులో గడిపారు.
> 2024లో బెయిల్ పొంది, తిరిగి సర్వీసులో చేరారు
> ఈమె ప్రస్తుతం 2026లో జార్ఖండ్ ఐటీ మరియు ఇ-గవర్నెన్స్ శాఖకు కార్యదర్శిగా ఉన్నారు
> ఈమెకు జార్ఖండ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ లిమిటెడ్ సీఈఓగా అదనపు బాధ్యతలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వాలు తమ శాఖలకు నాయకత్వం వహించడానికి అధికారులను ఎలా ఎంపిక చేస్తాయి? ఏ ప్రాతిపదికన?
See less

Monday, 6 July 2026

*IVF తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా ఫౌండేషన్ డే వేడుకలు*









*IVF తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా ఫౌండేషన్ డే వేడుకలు*

                    ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్టం శ్రీ గంజి రాజమౌళి గారి ఆధ్వర్యంలో 14 వ ఫౌండేషన్ డే ముషీరాబాద్ వాసవి హాస్టలో జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి గుప్త గారు మాట్లాడుతూ ఐవిఎఫ్ స్తాపించి 13 సంవత్సరాలు గడిచి 14 ఏట అడుగుపెట్టిన సందర్భంగా కీర్తిశేషులు రామ్ దాస్ దాస్ అగర్వాల్ గారిని గుర్తుచేశారు.పదమూడేళ్ళ క్రితం రామ్ దాస్ అగర్వాల్ గారు నాటిన ఐవిఎఫ్ అనే మొక్క ఎంతో ఎదిగి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా నిర్విరామంగా సేవలందిస్తుందని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి నాయకత్వంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటుందని కొనియాడారు.యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ఫౌండేషన్ డే సందర్భంగా ముషీరాబాద్ వాసవి హాస్టల్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ బట్టలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వాసవి సేవకేంద్రం అధ్యక్షులు, ఐ వి ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రయ్య గారు, అడ్వైసర్ ముత్యాల సత్తయ్య గారు, సీనియర్ ఫౌండర్ మెంబర్ ఉడుత పురుషోత్తం గారు,యూత్ అధ్యక్షులు కట్ట రవి కుమార్, యూత్ ట్రెజరర్ నరేష్ గుప్తా, ఆంధ్రప్రదేశ్ అడిషనల్ ట్రెజరర్ సూర్య ప్రకాష్ గుప్తా,హైదరాబాద్ అధ్యక్షులు పబ్బ మల్లేష్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ కాచం కృష్ణమూర్తి,GHMC యూత్ అధ్యక్షులు నవీన్ ,వైస్ ప్రెసిడెంట్ నీలా శ్రీధర్, హైదరాబాద్ జనరల్ సెక్రటరీ చిన్నం సత్యం ప్రవీణ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..


  1.  పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..


నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను ఓర్పుగా విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 63 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.


ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి కేసుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు చట్టపరమైన న్యాయం అందేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.


భూమి వివాదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత వ్యవహారాలు, దాడులు, వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రతి కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.


ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్భయంగా పోలీస్ శాఖను ఆశ్రయించాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

ఘనంగా జగ్జీవన్ రామ్ వర్ధంతి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు

  ఘనంగా జగ్జీవన్ రామ్ వర్ధంతి


పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు

నల్గొండ:

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య అన్నారు. 

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం నల్లగొండలోని NG కళాశాల ఎదురుగా ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషిచేసి భారత దేశ ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలు అందించారని అన్నారు. 

అదేవిధంగా దేశ స్వాతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాల సాధన దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ శంకర్, మామిడి కార్తీక్, పెరిక వినాయక రాజ్, పెరిక అంజయ్య, పెరిక చిట్టి తదితరులు పాల్గొన్నారు.

Sunday, 5 July 2026

స్వర్గస్తుడి సంతకంతో చెక్ జారీ..! తెలంగాణ ఆర్య వైశ్య మహాసభలో తీవ్ర వివాదం**


స్వర్గస్తుడి సంతకంతో చెక్ జారీ..!                               తెలంగాణ ఆర్య వైశ్య మహాసభలో తీవ్ర వివాదం**                                  హైదరాబాద్ : తెలంగాణ ఆర్య వైశ్య మహాసభలో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. మహాసభ ద్వారా ఒక శ్రీయశ్రీ విద్యార్థినికి ₹5,000/- విలువైన చెక్ జారీ చేయగా, ఆ చెక్‌పై స్వర్గస్తులైన కీ.శే. మిత్తినింటి వెంకటేశ్వర్లు గారి సంతకం ఉండడం పెను దుమారం రేపుతోంది. 04-07-2026 తేదీతో జారీ చేసిన చెక్‌పై మృతి చెందిన వ్యక్తి సంతకం ఎలా వచ్చిందనే అంశంపై ఆర్య వైశ్య సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంకటేశ్వర్లు గారు బ్రతికి వచ్చారా? లేదా ఆయన పేరును బద్నాం చేయాలనే దురుద్దేశ్యంతో ఈ చర్య చేపట్టారా? అని జాతి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది సాధారణ పొరపాటు కాదని, పెద్ద స్థాయి ద్రోహం, అధికార దుర్వినియోగం, నకిలీ సంతకాల వ్యవహారమని ప్రక్షాళన కమిటీ ఆరోపిస్తోంది. అధికారంలో ఉన్న కొందరు నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తూ జాతి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా మార్పు కోసం, క్రమశిక్షణతో, నిజాయితీతో పనిచేయకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అక్రమాలు, నకిలీ సంతకాలు, దుర్వినియోగం కొనసాగితే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కేసులు తప్పవని ప్రక్షాళన కమిటీ స్పష్టం చేసింది. “ప్రక్షాళన కమిటీ ఎందుకు?” అని ప్రశ్నించే వారికి మీరు చేసిన తప్పులే సమాధానం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. బీదల కోసం విద్య, వైద్యం, వసతి వంటి సేవలు నిజంగా అందిస్తే మద్దతు ఉంటుందని, కానీ కేవలం కన్వెన్షన్ హాళ్లు, అధికార దాహం కోసమే వ్యవహరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్య సమాజం డిమాండ్ చేస్తోంది.