ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి మిల్లర్లకు జిల్లా కలెక్టర్. బి. చంద్రశేఖర్.ఆదేశం
@ ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి మిల్లర్లకు జిల్లా కలెక్టర్. బి. చంద్రశేఖర్.ఆదేశం
శనివారం ఆయన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ తో కలిసి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
పౌర సరఫరాల అధికారులు,రైస్ మిల్ యాజమానులతో ధాన్యం ఆన్ లోడింగ్ పై సమీక్షించారు.
జిల్లాలో ఇప్పటివరకు 6 లక్షల 76 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశముందని చెప్పారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు జాప్యం చేయకుండా ధాన్యాన్ని అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు.
హమాలీల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే సుదూర ప్రాంతాల నుంచి హమాలీలను తీసుకురావాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం 400 లారీల ధాన్యాన్ని మిల్లులలో దించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల ప్రయోజనాల కై అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.
చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని, ఖాళీ అయిన ఐకేపీ కేంద్రాల హమాలీలను కూడా అన్లోడింగ్ పనులకు వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం అన్లోడింగ్ అయిన వెంటనే ట్రక్ షీట్లను
తీసుకెళ్లాలని తెలిపారు. రైస్ మిల్లులు,లారీ ట్యాగింగ్ సమస్యలు ఉంటే అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
మిర్యాలగూడ లారీ అసోసియేషన్ అదనంగా 50 లారీలను అందుబాటులో ఉంచాలని, ధాన్యం తరలింపు పూర్తయ్యే వరకు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్బంగా రైస్
మిల్లర్ అసోసియేషన్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.
లారీలు, హమాలీల కొరత లేకుండా
ధాన్యం రవాణా, అన్లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులకు సూచించారు.
లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
మిగిలిన ధాన్యాన్ని 10 రోజుల్లో పూర్తిగా లిఫ్టింగ్ చేయాలని తెలిపారు.
మిల్లులకు ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం వెంటనే పరిష్కరిస్తుందని , రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ శాఖలు, మిల్లర్లు, లారీ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి వెంకటేష్, మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు, పౌర సరఫరాల డిఎం రాంపత్తి నాయక్, తహసిల్దార్ శ్రీనివాస్, మిల్లర్లు గౌరు శ్రీనివాస్, బాబి ,
నవీన్ శ్రీరామ్, రైస్ మిల్స్ యజమానులు ,, అధికారులు హాజరయ్యారు.
____________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*










