ACB: ఏసీబీ వలలో ఎస్సై, పశువైద్యాధికారి
కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన వ్యాపారి కొండేశ్ తన కారును నిజామాబాద్కు చెందిన స్వామి అనే వ్యక్తికి 2022లో విక్రయించారు. విక్రయం సమయంలో ఆ కారుపై ఉన్న వాయిదాలను కొన్నవారే చెల్లించాలని ఒప్పందం కుదిరింది. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు, ఎన్వోసీ
ఇచ్చేందుకు లంచాలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు
ఖిల్లా (నిజామాబాద్)/ ఉట్నూర్: ఓ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు, మరో ఉదంతంలో ఎన్వోసీ ఇచ్చేందుకు లంచాలు తీసుకుంటూ ఎస్సై, పశువైద్యాధికారి ఎసీబీ అధికారులు దొరికిపోయారు. కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన వ్యాపారి కొండేశ్ తన కారును నిజామాబాద్కు చెందిన స్వామి అనే వ్యక్తికి 2022లో విక్రయించారు. విక్రయం సమయంలో ఆ కారుపై ఉన్న వాయిదాలను కొన్నవారే చెల్లించాలని ఒప్పందం కుదిరింది. అయితే స్వామి ఆ వాయిదాలను చెల్లించకపోవడంతో అసలు యజమాని కొండేశ్కు బ్యాంకు అధికారులు ఇటీవల నోటీసులు పంపారు. దీంతో స్వామిపై కొండేశ్ లింగంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో లింగంపేట ఎస్సై సుధాకర్ కారుతో సహా స్టేషన్కు రావాలని స్వామికి సూచించారు. స్వామి కారు తీసుకుని స్టేషన్కు వెళ్లగా కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశారు.
తాను అంతివ్వలేనని రూ.12,500 ఇస్తానని ఎస్సైతో చెప్పిన స్వామి అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు నిజామాబాద్లోని రుక్మిణి చాంబర్ సమీపంలో స్వామి.. రూ. 12,500 నగదును ఎస్సైకు ఇస్తుండగా అధికారులు రెడ్హ్యాండెడ్గా ఆయన్ను పట్టుకున్నారు. మరో ఉదంతంలో.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం సాంపూర్ గ్రామ పశు వైద్యాధికారి రాథోడ్ రమేశ్ తనతో పాటు ఆసుపత్రిలో పనిచేసిన ఉద్యోగికి ఎన్వోసీ ఇచ్చేందుకు రూ.25 వేలు డిమాండ్ చేశారు. చివరకు ఇద్దరి మధ్య రూ. 15 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం పశువైద్యాధికారి రాథోడ్ రమేశ్ కార్యాలయంలో సదరు ఉద్యోగి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు అరెస్టు చేశారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home