Saturday, 6 December 2025

పరకామణిలో చోరీ తర్వాత జరిగిందిదే..! నోరువిప్పిన నిందితుడు..!

పరకామణిలో చోరీ తర్వాత జరిగిందిదే..! నోరువిప్పిన నిందితుడు..! 

               

:తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న చోరీ ఘటన ఇప్పుడు కూటమి సర్కార్ లో మరోసారి తెరపైకి వస్తోంది. గతంలో వైసీపీ హయాంలో ఈ ఘటనకు కారకులైన వారు, ఫిర్యాదుదారులను లోక్ అదాలత్ లో రాజీ చేయించడంపై ఇప్పుడు రాజకీయ మాటల యుద్దం నడుస్తోంది. అలాగే ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు అనుమానాస్పద రీతిలో రైలు పట్టాలపై శవమై తేలారు. దీంతో పరకామణి వ్యవహారం అధికార, విపక్షాల మధ్య రాజకీయ అంశంగా మారిపోయింది. అలాగే ఈ చోరీకి పాల్పడిన టీటీడీ ఉద్యోగి రవి కుమార్ పాత్రపై పలు ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. దీంతో ఆయన ఇవాళ నోరు విప్పారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన రవి కుమార్ అప్పట్లో ఏం జరిగిందో కుండబద్దలు కొట్టారు. దీంతో పాటు తమపై తప్పుడు ప్రచారం చేయొద్దంటూ వేడుకున్నారు. 

             గతంలో తాను పెద్ద జీయర్ మఠంలో గుమస్తాగా పని చేస్తూనే పలు వ్యాపారాలు చేసినట్లు రవి కుమార్ తెలిపారు. రెండేళ్ల క్రిత్తం పరకామణిలో చోరికి పాల్పడింది నిజమే అన్నారు. అయితే పరకామణిలో చోరీని మహాపాపంగా భావించి తాను, తన కుటుంబం ఆస్థిలో 90 శాతం వేంకటేశ్వరస్వామివారికి రాసి ఇచ్చామని వెల్లడించారు. దీని వెనుక ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. అలాగే ఇతరులకు ఎవరికీ తాము డబ్బులు, ఆస్తి ఇవ్వలేదన్నారు. వైసీపీ నేతలు రవి కుమార్ నుంచి డబ్బులు తీసుకుని ఈ కేసు రాజీ చేయించినట్లు టీడీపీ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు. అయితే తనను కొంతమంది బ్లాక్‌మెయిల్ చేశారని రవికుమార్ వెల్లడించారు. వారిపై కేసు కూడా పెట్టినట్లు తెలిపారు. అలాగే తాను కొన్ని సర్జరీలు చేయించుకున్నానని, అనారోగ్యంతో బాధపడుతున్న తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని రవి కుమార్ ఆరోపించారు. కోర్టు ఆదేశిస్తే ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అయినా సిద్దమన్నారు. కానీ ఈ వివాదం వల్ల తనతో పాటు కుటుంబం కూడా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు ఆయన తెలిపారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home