Sunday, 18 January 2026

కేస్లాపూర్‌ నాగోబా జాతరకు సర్వం సిద్ధం.. నేటి నుంచే

 కేస్లాపూర్‌ నాగోబా జాతరకు సర్వం సిద్ధం.. నేటి నుంచే 

తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ "నాగోబా జాతర"కు సర్వం సిద్ధమైంది. గిరిజనుల అత్యంత పవిత్రమైన ఈ జాతరను పుష్యమాస అమావాస్య సందర్భంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి 10 గంటలకు జరిగే మహాపూజలతో నాగోబా జాతర అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే అంకురార్పణ కార్యక్రమం సందర్భంగా.. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. అనంతరం ఏడు రకాల నైవేద్యాలు సమర్పించి జాతర ఆరంభ ఘట్టాన్ని పూర్తిచేస్తారు. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఆదివాసీలు కేస్లాపూర్‌కు తరలివస్తారు. Also Read "తెలంగాణలో 20మంది IPS అధికారుల బదిలీ" జాతరలో భాగంగా ఈ నెల 20న మెస్రం వంశీయులు ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇతరులకు ఆలయంలో ప్రవేశం పూర్తిగా నిషేధం ఉంటుంది. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్ పూజలు, అలాగే మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొనే భాన్ దేవత పూజలు


జరుగుతాయి. ఇవి గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఈ నెల 22న మంత్రులు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తమ సమస్యలు, అవసరాలు, సంక్షేమ పథకాలపై సూచనలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది నాగోబా జాతరలో అత్యంత ప్రాముఖ్యమైన భాగంగా భావిస్తారు. తదుపరి రోజు 23న భేతల్ పూజలు, మండ గాజిలింగ్ కార్యక్రమాలతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగుస్తాయి. అయితే పూజలు ముగిసినా, నాగోబా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఈ నెల 25 వరకు కొనసాగనుంది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home