Sunday, 21 December 2025

కేసీఆర్ ఎంట్రీతో అనూహ్య పరిణామాలు

 కేసీఆర్ ఎంట్రీతో అనూహ్య పరిణామాలు

                ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఘాటు విమర్శలు సంధించారు. తనదైన శైలిలో చురకలు అంటించారు. కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. తెలంగాణ తిరోగమిస్తోందంటూ మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల మళ్లీ ఫ్యూడల్ భావాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఫ్యూచర్ సిటీపైనా నిప్పులు చెరిగారు.

            తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేసీఆర్. దాదాపుగా ఎనిమిది నెలల తర్వాత మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడారు. జలవనరులు, వ్యవసాయం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సహా పలు అంశాల గురించి ప్రస్తావించారు. విస్తృతస్థాయి సమావేశంలో చర్చకు వచ్చిన విషయాలపై వివరించారు.

                       ఉమ్మడి ఏపీలో మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని, ప్రత్యేక రాష్ట్రంలోనూ ఇదే కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు ద్రోహం చేస్తోన్నాయని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 308 కిలో మీటర్ల కృష్ణా నది పారుతుందని, గత ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 టీఎంసీలు ఈ జిల్లాకు రావాల్సి ఉన్నప్పటికీ.. అలా జరగట్లేదని అన్నారు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు.

          కేసీఆర్ విమర్శలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని ఎదురుదాడికి దిగారు. రెండేళ్ల తర్వాత కేసీఆర్ కలుగులో నుంచి బయటికి వచ్చాడని, ఓటమితో ఆయన మారుతారని ఆశించానని అలాంటిదేమీ లేదని చెప్పారు. మళ్లీ అబద్ధాలే చెబుతూ తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తోన్నారని విమర్శించారు.

            కేసీఆర్‌ సీఎం అయ్యాకే జలదోపిడీ జరిగిందని, కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే.. కృష్ణా జలాలపై అసెంబ్లీలో వివరిస్తానని అన్నారు. కృష్ణా జలాల్లో ఏపీకి 64 శాతం, తెలంగాణకు 36 శాతం చాలని కేసీఆర్‌ గతంలో సంతకం పెట్టాడని ఆరోపించారు. కడుపునిండా విషం పెట్టుకున్న హరీష్ రావు కేటీఆర్ కు గురువు కేసీఆర్‌ అని, ఈ ముగ్గురూ కలిసి కవితను వాళ్లే బయటకు పడేశారని విమర్శించారు. ఉన్న ఒక్క చెల్లెలికి చీర, సారె పెట్టలేక బయటకు పంపారని, వాళ్లు తెలంగాణ సమాజాన్ని ఏం బాగుచేస్తారని అన్నారు.

            కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా కొడుకు, అల్లుడే చేస్తున్నారని రేవంత్ అన్నారు. యూరియా పంపిణీలో టెక్నాలజీని వినియోగించడం వల్ల ఇబ్బందేమిటని ప్రశ్నించారు. దీనికోసం యాప్‌ పెడితే నష్టమేంటని అన్నారు. కృష్ణా బేసిన్‌ దెబ్బతినడానికి, రైతులు నష్టపోవడానికి కారణం కేసీఆర్, ఆయన కుటుంబ పాలనేనని చెప్పారు. పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టు ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కృష్ణా బేసిన్‌లో కేసీఆర్‌ చేసింది దగా, మోసమంటూ మండిపడ్డారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home