Thursday, 15 May 2025

7 ఐటీఆర్ ఫారాలు విడుదల.. పన్నుచెల్లింపుదారులు ఈ మార్పులు కచ్చితంగా తెలుసుకోండి.


 7 ఐటీఆర్ ఫారాలు విడుదల.. పన్నుచెల్లింపుదారులు ఈ మార్పులు కచ్చితంగా తెలుసుకోండి.
.

ఆదాయపు పన్ను శాఖ 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారాలను విడుదల చేసింది. వేతన జీవులు, చిన్న వ్యాపారులు ఐటీఆర్-1, ఐటీఆర్-4 ద్వారా సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లపై రూ. 1.25 లక్షల వరకు లాభాలు పొందినవారు కూడా ఈ ఫారాలను ఉపయోగించవచ్చు. ఐటీఆర్-3 దాఖలు చేసే వ్యాపారస్తులకు సంపద పరిమితి రూ. 1 కోటి వరకు పెంచడంతో ఊరట లభించింది. గడువు తేదీ జూలై 31 లోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే ఆఖర్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదు.

ITR Filing 2025 key changes

ఐటీఆర్ ఫారాలకు కీలక మార్పులు

ఆదాయపు పన్ను శాఖ 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరం కోసం ఏడు ఐటీఆర్ (ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్) ఫారాలను విడుదల చేసింది. పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయడానికి ఈ ఫారాలను ఉపయోగిస్తారు. ఏయే ఫారాలు ఎవరికి వర్తిస్తాయో ఇప్పుడు చూద్దాం.

ITR-1 (సహజ్): వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్నవారికి ఈ ఫారం వర్తిస్తుంది. జీతం తో పాటు వన్ హౌస్ ప్రాపర్టీ, వడ్డీ ఆదాయం, రూ. 5,000 వరకు వ్యవసాయ ఆదాయం ఉన్నవారు ఈ ఫారం ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.


ITR-2: ఎలాంటి వ్యాపారం లేని వారు, కానీ మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్స్) ఉన్నవారికి ఈ ఫారం వర్తిస్తుంది.




ITR-3: వ్యాపారం లేదా వృత్తి ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు (HUF) ఇది వర్తిస్తుంది


ITR-4 (సుగమ్): రూ. 50 లక్షల వరకు వ్యాపారం లేదా వృత్తి ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ (LLP) కాని సంస్థలకు ఇది వర్తిస్తుంది.


ITR-5: సంస్థలు, LLPలు, మరియు సహకార సంఘాలు ఈ ఫారం ఫైల్ చేయాలి.


ITR-6: కంపెనీల చట్టం కింద నమోదైన కంపెనీలకు ఇది వర్తిస్తుంది


ITR-7: ట్రస్ట్‌లు మరియు దాతృత్వ సంస్థలకు ఇది వర్తిస్తుంది.


కీలక మార్పులు

ఈ సంవత్సరం కీలక మార్పు జరిగింది. వేతన జీవులు, చిన్న వ్యాపారులు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్‌ల నుండి రూ. 1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG) పొందిన వారు ఇప్పుడు ITR-1 లేదా ITR-4 ఫారాలను ఉపయోగించి రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు. గతంలో వీరు సంక్లిష్టమైన ITR-2 ఫారం ఉపయోగించాల్సి వచ్చేది. కానీ తాజాగా చేసిన మార్పులతో మూలధన లాభాలు ఉన్నవారికి ఐటీఆర్ దాఖలు సులభం అవుతుంది. పన్ను నిబంధనల ప్రకారం షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ల నుంచి రూ. 1.25 లక్షల వరకు దీర్ఘకాలిక లాభాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ మొత్తాన్ని మించిన లాభాలకు 12.5 శాతం పన్ను వర్తిస్తుంది.


వ్యాపార యజమానులకు ఊరట

ఐటీఆర్ ఫారమ్ -3 దాఖలు చేసే వ్యాపార యజమానులకు ఈసారి ఊరట లభించింది. గతంలో మొత్తం సంపద రూ. 50 లక్షలు దాటితే ఆస్తులు, అప్పుల వివరాలను 'షెడ్యూల్ AL'లో ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఈ పరిమితి రూ. 1 కోటికి పెరిగింది. అంటే, రూ. 1 కోటి కంటే తక్కువ సంపద ఉన్నవారు ఈ వివరాలను నివేదించాల్సిన అవసరం లేదు.

గడువు గుర్తుంచుకోండి

చాలా మంది వ్యక్తులకు ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువు జూలై 31 తో ముగుస్తుంది. ఒకవేళ మీకు ఆడిట్ అవసరం లేకపోతే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే ఐటీఆర్ ఫైల్ చేస్తే మంచిది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home