Tuesday, 23 September 2025

జూబ్లీహిల్స్ ఆ పార్టీదే.. సంచలన సర్వే రిలీజ్..!

      జూబ్లీహిల్స్ ఆ పార్టీదే.. సంచలన సర్వే రిలీజ్..!

తెలంగాణ‌ రాజ‌కీయాల్లో హీట్ పుట్టిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేయ‌డం ఖాయ‌మ‌ని అంతర్గత స‌ర్వేలో వెల్ల‌డైంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమలు చేస్తున్న ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల ప‌ట్ల మ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబాలు, మ‌హిళ‌లు, యువ‌త సంతృప్తిగా ఉన్న‌ట్టు అంతర్గత సర్వే నివేదిక తెలిపింది.

           జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి 48.32 శాతం ప్ర‌జామోదం ల‌భించింది. బీఆర్‌ఎస్‌ 34.17 శాతానికి ప‌రిమిత‌మైంది. ఇక బీజేపీ వైపు కేవ‌లం 16.04శాతం మంది ఓట‌ర్లు అనుకూలంగా స్పందించారు. స్వతంత్ర అభ్యర్థులు 1.47శాతం ఓట్లు పొందుతారని అంతర్గత స‌ర్వే అంచ‌నా వేసింది.

    ఉపఎన్నిక స‌మీపిస్తుండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలోని క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌పై ఓ ప్రైవేటు సంస్థ ఇటీవ‌ల అంతర్గత స‌ర్వే నిర్వ‌హించింది. షేక్‌పేట్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండలోని 19 కాలనీల్లో 2,000 మంది ఓటర్ల అభిప్రాయాల‌ను సేక‌రించింది.

సంక్షేమ మంత్రమే కాంగ్రెస్ బ‌లం..!

       కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల‌ ఉచిత విద్యుత్, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల జారీ, ఉపాధి క‌ల్ప‌న వంటి అంశాలు మహిళలు, యువ ఓటర్లపై బలంగా ప్రభావం చూపుతున్నాయని సర్వేలో తేలింది. సంక్షేమ‌ పథకాలు తమ కుటుంబాల అవసరాలను తీర్చడమే కాకుండా, నెలవారీ ఖర్చులను కూడా తగ్గించాయని ప్రజలు అభిప్రాయపడ్డారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం సన్న బియ్యం ఉచితంగా పొందడం ద్వారా నెలకు దాదాపు రూ. 1,500 ఆదా చేసుకోగలుగుతోందని మెజారిటీ మ‌హిళ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

           అలాగే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వల్ల ప్ర‌తి కుటుంబానికి నెలకు దాదాపు రూ. 1,100, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మరో రూ. 800 రవాణా ఖర్చులలో ఆదా అవుతున్నాయని వెల్ల‌డించారు. ఇవన్నీ కలిపి ఒక కుటుంబానికి ఏటా దాదాపు రూ. 45,000 ఆదా అవుతున్నాయ‌ని వెల్ల‌డించారు. ఈ పొదుపును ఇతర ఖర్చులకు కేటాయించుకుంటూ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటున్నామని సర్వేలో పాల్గొన్న మహిళలు తెలిపారు. సంక్షేమ‌ పథకాల వల్ల లబ్ధి జ‌రుగుతోంద‌ని, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇవి ప్రోత్సాహం ఇచ్చాయని కార్డు లేని వారు త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

          తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగ‌ణ‌న‌పై, బీసీ రిజర్వేషన్ల పట్ల వెనుకబడిన తరగతుల ప్రజలు సానుకూలంగా స్పందించారు. పాలన విషయానికి వస్తే నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో డ్రైనేజీ, రోడ్లు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల ప‌ట్ల‌ ఎక్కువమంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఫించ‌న్ల ఆల‌స్యం, ప‌వ‌ర్ క‌ట్ అంశాల‌పై కొంత మేర‌కు స‌మ‌స్య‌లున్నా ఐదు-పాయింట్ల సంతృప్తి స్కేల్‌లో 60 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు న‌గ‌ర‌ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ కృషిపై సంతృప్తి లేదా అత్యంత సంతృప్తిని వ్య‌క్తం చేశారు.

              దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ పట్ల ఉన్న సానుభూతిపై బీఆర్‌ఎస్ ఆధారపడి ఉన్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మాగంటి సునీత‌, వ‌జ్ర‌నాథ్ వ‌ర్గాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం, పార్టీ అభ్య‌ర్థిత్వంపై రావుల శ్రీధ‌ర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నార‌నే ప్ర‌చారం, బీజేపీతో ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌నే ప్ర‌చారం వ‌ల్ల బీఆర్ఎస్ క్యాడ‌ర్‌ ఆయోమ‌యంలో ప‌డింద‌ని స‌ర్వేలో తేలింది. ఈ స‌మీక‌ర‌ణాలు అన్నీ కూడా క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలాంశాలుగా మారాయ‌ని వెల్ల‌డించింది. మజ్లిస్ పార్టీ ఎన్నిక‌ల బ‌రిలో లేకపోవడం, బీఆర్‌ఎస్ పార్టీకి మైనారిటీల మద్దతు తగ్గడం కాంగ్రెస్ పార్టీకి మ‌రింత‌ లాభిస్తుంద‌ని పేర్కొంది.

                అంతర్గత సర్వే ప్రకారం, బీజేపీకి 16 శాతం ఓట్ల వాటా లభించినప్పటికీ, నియోజకవర్గంలో ఆ పార్టీకి బలమైన బూత్ స్థాయి కార్యకర్తలు లేరని, అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం బలమైన ప్రత్యామ్నాయంగా ఉంటుందని సర్వే పేర్కొంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ కంటే 14.15 శాతం ఆధిక్యం ఉన్నప్పటికీ, ఉపఎన్నిక అంచనాలకు అందకుండా ఉంటుందని సర్వే పేర్కొంది. స్థానిక అంశాలు, ఓటింగ్ శాతం ఉపఎన్నికల ఫ‌లితాల‌పై ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని అంతర్గత స‌ర్వే అంచ‌నా వేసింది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home