covid : ఏపీలో మరిన్ని కోవిడ్ కేసులు..!విశాఖలో ఒమిక్రాన్..! టెస్టులపై కీలక ఆదేశాలు..!
ఏపీలో మరిన్ని కోవిడ్ కేసులు..!విశాఖలో ఒమిక్రాన్..! టెస్టులపై కీలక ఆదేశాలు..!
ఏపీలో కోవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వం గుర్తిస్తున్న కేసుల కంటే ఎన్నో రెట్లు అధికంగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రభుత్వం తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో బయటపడిన కేసుల్లో శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తే కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ గా దీన్ని గుర్తించారు. అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సిందేమీ లేదని అధికారులు చెప్తున్నారు.
కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షల సామర్ధ్యాన్ని కూడా పెంచాలని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తక్కువ స్థాయిలోనే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని, జ్వరం వంటి రోగ లక్షణాలతో ప్రభుత్వ సర్వజనాసుపత్రులకు వస్తున్న వారికి నియమాల మేరకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కొవిడ్ పరీక్షలు చేయడానికి అవసరమయ్యే విటిఎం(వైరల్ ట్రాన్స్మిషన్ మీడియా) కిట్లు, ఆర్ ఎన్ఎ ఎక్సాట్రాక్షన్ కిట్లు , ఆర్టిపిసిఆర్ కిట్ల లభ్యతపై కృష్ణబాబు ఆరా తీసారు. పరిస్థితిని బట్టి కొవిడ్ పరీక్షలు పెంచే దిశగా రోజుకు వెయ్యి మందికి పరీక్షలు చేసేందుకు తగు చర్యల్ని చేపట్టాలని కృష్ణబాబు ఆదేశించారు. పాత జీజీహెచ్ లలో రోజుకు 100 చొప్పున, కొత్త జీజీహెచ్ లలో రోజుకు 50 చొప్పున పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ మేరకు నెల రోజులకు అవసరమయ్యే కిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మరోవైపు విశాఖలో తాజాగా బయటపడిన కేసుల్లో శాంపిల్స్ ను పరీక్షలకు పంపగా.. అందులో ఒమిక్రాన్ వేరియంట్ (బీఏ2) బయటపడింది. విశాఖ కేజీహెచ్ అధికారులు దీన్ని ధృవీకరించారు. దీంతో ఇతర ప్రాంతాల్లో తీసుకున్న శాంపిల్స్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి కూడా వచ్చాక ఓమిక్రాన్ మాత్రమే ఉందా లేక ఇతర వేరియంట్లు కూడా ఉన్నాయా అన్నది తేల్చనున్నారు. అయితే ప్రస్తుతానికి పరిస్ధితి అదుపులోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home