Sunday, 27 April 2025

ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2 వేలు.. పీఎం కిసాన్ 20వ విడత అప్పుడే! ఈ పని చేస్తేనే..



         పీఎం కిసాన్ యోజన 20వ విడత మే లేదా జూన్ 2025 నాటికి విడుదల కానుంది. దీని ద్వారా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 2 వేల చొప్పున జమవుతాయి. రైతులు తమ పేమెంట్ స్టేటస్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. పథకం నిరంతర ప్రయోజనం కోసం ఇ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ, బయోమెట్రిక్ లేదా ఫేస్-అథెంటికేషన్ ద్వారా ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు.

పీఎం కిసాన్ పథకం 

        : భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పథకం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) యోజన. త్వరలో తన 20వ విడతను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మే లేదా జూన్ 2025 నాటికి ఈ విడత నగదు.. రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. ఇది వ్యవసాయ రంగానికి చేయూతనివ్వడానికి ఇంకా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకం అని చెప్పొచ్చు. పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందుతుంది. దీనిని నాలుగు నెలల వ్యవధిలో విడతకు రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.


19వ విడతలో రూ. 22,000 కోట్లు పంపిణీ..

ఫిబ్రవరి 2025లో, ప్రభుత్వం విజయవంతంగా 19వ విడతను పంపిణీ చేసింది. దీని ద్వారా 9.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు, వీరిలో 2.41 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మొత్తం రూ. 22,000 కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. 20వ విడత త్వరలో విడుదల కానుండటంతో రైతులు ఈ నగదు కోసం ఎదురుచూస్తున్నారు.

                రైతులు పీఎం-కిసాన్ అధికారిక పోర్టల్‌లో తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌టుడేట్ ఉంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇంకా పీఎం కిసాన్ యోజనలో అర్హత, అప్లికేషన్, పేమెంట్ స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.

           భార్యాభర్తలు, మైనర్ పిల్లలు కలిగి సాగుకు అనువైన భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబం ఈ పథకానికి అర్హులు. అయితే, కొన్ని అధిక ఆదాయ వర్గాల వారికి దీని నుంచి మినహాయింపు ఉంది. ఈ పథకం ప్రయోజనం పొందడానికి, రైతులకు చెల్లుబాటు అయ్యే భూమి రికార్డులు, బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. 20వ విడత స్టేటస్ చెక్ చేయడానికి.. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అక్కడ ఫార్మర్స్ కార్నర్‌లో 'నో యువర్ స్టేటస్'పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఖాతా నంబర్ లేదా అప్లికేషన్ IDని నమోదు చేయండి. మీ పేమెంట్ స్టేటస్ కోసం 'గెట్ డేటా'పై క్లిక్ చేయండి.

పీఎం కిసాన్ ఇ-కేవైసీ..

పీఎం కిసాన్ పథకం ప్రయోజనం ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు చేరడం కోసం ఇ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి చేశారు. ఇ-కేవైసీ కాకుంటే అకౌంట్లో డబ్బులు పడవని గుర్తుంచుకోవాలి.

ఇ-కేవైసీ విధానాలు..

రైతుల కోసం మూడు రకాల ఇ-కేవైసీ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీపీ బేస్డ్ ఇ-కేవైసీ. ఇది పీఎం-కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది. దీని కోసం రైతు ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. రెండోది బయోమెట్రిక్ బేస్డ్ ఇ-కేవైసీ. ఈ సౌకర్యం కామన్ సర్వీస్ సెంటర్‌లు (సీఎస్‌సీలు), వివిధ రాష్ట్ర సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంది. ఇంకా పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్‌తో కూడా ఇ-కేవైసీ పూర్తి చేయొచ్చు.

కాబట్టి, పీఎం కిసాన్ పథకం 20వ విడత ప్రయోజనం పొందడానికి రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే.. సకాలంలో ఆర్థిక సహాయం పొందొచ్చు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home