Thursday, 17 April 2025

భూ భారతి చట్టం చారిత్రాత్మక చట్టం అని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అన్నారు.

       భూ భారతి చట్టం చారిత్రాత్మక చట్టం అని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అన్నారు.






     భూ భారతి చట్టం( భూమి హక్కుల రక్షణ చట్టం- 2025 ) పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆయన దేవరకొండ రైతు వేదికలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .


      ప్రతి రైతుకు మేలు జరిగే లా రాష్ట్ర  ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, రైతుల భూముల సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతుల భూ సమస్యలతోపాటు, ఇండ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను దీని ద్వారా  పరిష్కరించుకోవచ్చని అన్నారు. గ్రామంలో సమస్యలన్నీటిని రెవెన్యూ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. భూ భారతి చట్టంపై గ్రామ గ్రామాన రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని, 100 సంవత్సరాల వరకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. భూభారతి చట్టంలోని సెక్షన్లు, షెడ్యూళ్లు అందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన రీతిలో చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ,రైతులు దీనిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు . చట్టం చేసే ముందు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలోని, నాలుగు మండలాలలో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ధరణి పోర్టల్  లో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు అనేక ప్రయోజనాలను ఈ చట్టంలో కల్పించడం జరిగిందని ,ఇకపై భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని ఆయన తెలిపారు.భూ భారతి చట్టంతో భూమి కలిగిన రైతులకు భూమి మీద హక్కును కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. భూమి కలిగిన ప్రతి పేదవాడికి దీని వల్ల మేలు కలుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యాన్ని  పంపిణీ చేస్తున్నదని ,సన్నధాన్యం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు, 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, అదే ధాన్యాన్ని  సన్న బియ్యంగా మార్చి పేదలకు పంచుతున్నట్లు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. దీంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, కులగనన, ఎస్సీ వర్గీకరణ  వంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.


         రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం  భూభారతి చట్టమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

 ధరణి పోర్టల్ లో  లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా దొరుకుతుందని, జూన్ 2 నుండి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందన్నారు.భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు మీ -సేవలో లాగే  భూ భారతి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందని, ఒకవేళ పరిష్కరించలేక పోతే  చాలాన్ ద్వారా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు.ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్స్ పై ఎలాంటి ప్రస్తావన లేదని ,  అయితే భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 న భూభారతి చట్టం లోని నిబంధనల ప్రకారం  రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూభారతి పోర్టల్  లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు. భూ భారతి చట్టంలోని ముఖ్యమైన అంశాలను ఆమె వివరిస్తూ భూ భారతి చట్టంలో మ్యుటేషన్లు ఆటోమేటిక్ గా అవుతాయని ,30 రోజుల్లో మ్యుటేషన్ కాకపోతే 31 వ రోజు ఆటోమెటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామా కు సంబంధించిన వివరాలు అన్నింటిని రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై అందరికీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.  భూ భారతి చట్టంలోని అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్డిఓ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇక్కడ ఫిర్యాదులను సమర్పించి పరిష్కరించుకోవచ్చని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయసహాయం అవసరమైతే ఉచిత న్యాయ సహాయాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.భూ భారతి చట్టం ద్వారా భూములకు సంబంధించిన అవినీతిని అరికట్టి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.

    అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి లు భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు.

     స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home