Wednesday, 27 November 2024

ఏం జరుగుతోంది?: తెలంగాణ బీజేపీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు




 ఏం జరుగుతోంది?: తెలంగాణ బీజేపీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు 

 న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర పథకాలను సమగ్ర అమలు చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పలు అభివృద్ధి పనులపై చర్చించారు. "మోడీ! ది బ్రాండ్: ప్రధానిపై చంద్రబాబు ప్రశంసల వర్షం" ఎంపీలు, ఎమ్మెల్యేల యోగక్షేమాలను ప్రధాని అడిగినట్లు సమాచారం. కలిసి మెలిసి పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. 2028లో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే సమన్వయంతో కష్టపడి పని చేయాలని చెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం సమావేశం ఫొటోలతో ప్రధాని మోడీ ఎక్స్‌లో ఇంగ్లీష్ తోపాటు తెలుగులోనూ పోస్టు చేశారు. 'తెలంగాణ బీజేపీకి చెందిన శాసనసభ్యులు, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా పెరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు. బీఆర్‌ఎస్ దుష్టపాలన గురించి పూర్తిగా భయంకరమైన జ్ఞాపకాలను కలిగి ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ గట్టి స్వరం వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు అని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home